ప్రకరణ 31 - ఆస్థి హక్కు
ఆస్థి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. పార్లమెంటు ఆస్థి హక్కుకు సంబంధించి అనేక సవరణలు, చట్టాలు చేసింది. 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ, 1964లో 17వ రాజ్యాంగ సవరణ, 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేశారు. చివరకు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్థి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాల నుండి తొలగించి 12వ భాగంలో ప్రకరణ 300A లో రాజ్యాంగ పరమైన హక్కుగా (Constitutional Rights) చేర్చారు.
ఇది జూన్ 20వ తేదీ 1979 నుంచి అమలులోకి వచ్చింది. అలాగే ఆస్థి హక్కుకి సంబంధించి నూతన నిబంధనలను కూడా చేర్చారు.
ప్రకరణ 31(A) - ప్రభుత్వం ఆస్థిని స్వాధీనం చేసుకున్నప్పుడు వర్తించే కొన్ని మినహాయింపులు ఈ ప్రకరణలో పేర్కోన్నారు. భూ సంస్కరణ అమలు కోసం అలాంటి చట్టాలు చేసినప్పుడు అవి ప్రకరణ 14, 19కి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానాలలో ప్రశ్నించరాదు.
ప్రకరణ 31(B) - కొన్ని చట్టాల వర్తింపుకు మినహాయింపులు. వీటిని తొమ్మిదవ షెడ్యూల్లో ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంపైన ఇలాంటి చట్టాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. 9వ షెడ్యూల్ లో పేర్కొనబడిన అంశాలు సాధారణంగా న్యాయ సమీక్షకు గురి కావు. అయితే న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమౌతుందని దానిని పరిమితం చేయడానికి పార్లమెంటుకు అధికారం లేదని 1973లో కేశవానంద్ భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
2007లో ఐ.ఆర్. కొహెల్హో Vs తమిళనాడు కేసులో న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది కనుక, 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చబడిన అంశాలు న్యాయ సమీక్షకు గురౌతాయని వ్యాఖ్యానించింది.
ప్రకరణ 31(C) - నిర్దేశక నియమాల అమలు కోసం ప్రాథమిక హక్కులపై, ముఖ్యంగా ఆస్థి హక్కుపై కొన్ని పరిమితులు విధించవచ్చు. అలా విధించిన పరిమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానాలలో ప్రశ్నించే వీలులేదు.
ఆదేశిక నియమాలలోని ప్రకరణ 39లోని క్లాజు B మరియు Cలో ప్రస్తావించిన సామ్యవాద తరహా సమాజ స్థాపనకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని పరిమితులు విధిస్తే, ఆ పరిమితులు ప్రాథమిక హక్కులకు వ్యతిరకమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలు లేదు.
ప్రత్యేక వివరణ
ప్రకరణ 31(A), 31(B), 31(C)లు ఆస్తి హక్కుపై పరిమితులకు సంబంధించినవి. ఇవి ఎలాంటి ప్రాథమిక హక్కులను ప్రసాదించవు. 1978 లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రకరణ 31 తొలగించినప్పటికీ వీటిని మాత్రం కొనసాగించారు.
ప్రకరణ 32- రాజ్యాంగ పరిహార హక్కు (Right to Constitutional Remedies)
రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులలో అత్యంత ముఖ్యమైనది. మూడవ భాగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా లేదా ఆ హక్కులను పరిమితం చేసినా లేదా అమలు చేయకపోయినా, బాధితులు నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించి తగిన రాజ్యాంగ పరిహారాలను పొందవచ్చు. మొదటి ఆరు ప్రాథమిక హక్కుల అమలు ఈ నిబంధన పైనే ఆధారపడి ఉంటాయి. హక్కులను గుర్తించడంతో పాటు, వాటి అమలుకు హామీ కూడా ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది. అమలు కాని హక్కులు వ్యర్థం.
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు నిబంధన 32(4) హామీ ఇస్తున్నందునే డా. బి.ఆర్. అంబేద్కర్ ఈ హక్కును “రాజ్యాంగ ఆత్మగా, హృదయంగా” వర్ణించారు.
ప్రకరణ 32(1) - ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అవి అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన పరిహారంను పొందవచ్చు
ప్రకరణ 32(2)
ఈ భాగంలోనే హక్కులను కాపాడటానికి ప్రత్యేక ఆదేశాలైన హెబియస్ కార్చస్, మాండమస్, ప్రొహిబిషన్, కో-వారెంటో, సెర్షియరీ లాంటి రిట్లను సుప్రీంకోర్టు జారీ చేస్తుంది.
ప్రకరణ 32(3) - సుప్రీం కోర్టు యొక్క అధికారాలకు విఘాతము కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు (స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులు) కూడా రిట్లు జారిచేసే అధికారాన్ని పార్లమెంటు చట్టం ద్వారా కల్పించవచ్చు.
ప్రకరణ 32(4) - రాజ్యాంగంలో ఇతరత్రా అనుమతించిన విధంగా తప్ప ఈ ప్రకరణ ద్వారా గుర్తించిన హక్కులు రద్దు కావు.
ప్రత్యేక వివరణ
రాజ్యాంగ పరిహారపు హక్కు మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని. 1981లో ఫర్టీలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
1 Comments
Surya
ReplyDelete